కలం, ఖమ్మం బ్యూరో : విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా కలెక్టర్ అంకిత్ (Collector Ankit) స్పష్టం చేశారు. అలాంటి వారిపై పైస్థాయి అధికారులు కూడా చర్యలు తీసుకోకపోతే, వారిపైనే చర్యలు తీసుకుంటామని ఘాటుగా హెచ్చరించారు. శనివారం ఆళ్ళపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్, పలు శాఖల పనితీరును సమీక్షించారు. ముఖ్యంగా మధ్యాహ్న భోజన పథకంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మండలంలోని పాఠశాలల్లో మెనూ పాటించకపోవడం, ఆహార నాణ్యతలో లోపాలు ఉన్నట్లు గుర్తించిన ఆయన, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే మీపై చర్యలు ఉంటాయని ఎంఈఓ శాంతారావును గట్టిగా హెచ్చరించారు.
అనంతోగు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం, ఆళ్లపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను పరిశీలించి, బోధన ప్రమాణాలపై సూచనలు చేశారు. పాఠశాల కిచెన్, స్టోర్ రూమ్లను పరిశీలించి, విద్యార్థులకు పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యుత్ సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుసుకున్న కలెక్టర్, ఇన్వర్టర్ ఏర్పాటు ద్వారా సమస్యను త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఆళ్లపల్లి గ్రామంలో రైతు మద్దెల వెంకటేశ్వర్లు సాగు చేస్తున్న ఆయిల్ పామ్ తోటను సందర్శించిన కలెక్టర్, సాగు విధానం, దిగుబడి, ఆదాయం వంటి అంశాలపై రైతుతో చర్చించారు. రైతులు ఆధునిక పద్ధతులు అనుసరించాలని సూచించారు. తదుపరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ (Collector Ankit), ఇన్పేషెంట్, ఔట్పేషెంట్ సేవలు, ల్యాబ్, మందుల నిల్వలను పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన మందులు ఎప్పుడూ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఈ పర్యటనలో తహసీల్దార్ జగదీష్వర్ ప్రసాద్, ఎంపీడీఓ శ్రీను, మండల ప్రత్యేక అధికారి లాల్ చంద్, ప్రధానోపాధ్యాయురాలు సరోజినీ, హెల్త్ ఎడ్యుకేటర్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
Read Also: రాజకీయాల నుంచి తప్పుకుంటా.. కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Follow Us On: Instagram

