కలం, వెబ్ డెస్క్: ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో పరుగుల వేట మొదలైతే ఆ వేడి ఎలా ఉంటుందో సమీర్ రిజ్వీ మరోసారి చూపించాడు. ముంబై ఇండియన్స్తో జరిగిన ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) 6 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ముంబై ఇన్నింగ్స్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (51) హాఫ్ సెంచరీతో మెరవగా, రోహిత్ శర్మ (35) విలువైన పరుగులు జోడించాడు. అయితే ఢిల్లీ బౌలర్లు ముకేశ్ కుమార్ (2 వికెట్లు), అక్షర్ పటేల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ముంబై భారీ స్కోరు సాధించలేకపోయింది. ముఖ్యంగా తిలక్ వర్మను డకౌట్ చేసిన ముకేశ్, ముంబై టాప్ ఆర్డర్ను గట్టి దెబ్బకొట్టాడు.
163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఆరంభంలోనే షాక్ తగిలింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ కేవలం ఒక పరుగుకే వెనుదిరగగా, నితీష్ రాణా ఖాతా తెరవకుండానే రనౌట్ అయ్యాడు. కేవలం 7 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును సమీర్ రిజ్వీ ఒంటిచేత్తో ఆదుకున్నాడు. ముంబై బౌలర్లను ఉతికేస్తూ కేవలం 51 బంతుల్లోనే 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 90 పరుగులు పిండుకున్న రిజ్వీ.. మ్యాచ్ను పూర్తిగా ఢిల్లీ వైపు తిప్పేశాడు. అతనికి జతగా పాతుమ్ నిస్సాంక (44) బాధ్యతాయుతంగా ఆడటంతో ఢిల్లీ విజయం సులువైంది. చివర్లో డేవిడ్ మిల్లర్ (21 నాటౌట్) ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో 18.1 ఓవర్లలోనే ఢిల్లీ లక్ష్యాన్ని ఛేదించింది. ముంబై బౌలర్లలో బుమ్రా పొదుపుగా బౌలింగ్ చేసినా వికెట్లు తీయలేకపోవడం ఆ జట్టును దెబ్బకొట్టింది. మొత్తానికి హోమ్ గ్రౌండ్లో ఢిల్లీ కుర్రాళ్లు చూపించిన తెగువకు ముంబై తలవంచక తప్పలేదు.

