కలం, మహబూబ్నగర్ బ్యూరో : మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం కర్వేన ప్యాకేజీ–14, 15లో నిర్మాణంలో ఉన్న రిజర్వాయర్ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) శుక్రవారం పరిశీలించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా జరుగుతున్న ఈ రిజర్వాయర్ పనుల పురోగతిపై సీఎం ఇరిగేషన్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఎంత మేర పనులు పెండింగ్లో ఉన్నాయని ప్రశ్నించగా, సుమారు రూ.500 కోట్ల పనులు మిగిలి ఉన్నాయని ఇరిగేషన్ సీఈ అధికారులు తెలిపారు.
కోయిల్సాగర్ ప్రాజెక్టు, భూత్పూర్ రిజర్వాయర్ల (Bhuthpur Reservoir) సామర్థ్యాన్ని పెంచే అవకాశాలను పరిశీలించాలని సీఎం ఇరిగేషన్ సీఈకు సూచించారు. ఆగష్టులో మళ్లీ సమీక్షకు వస్తానని తెలిపిన సీఎం, అప్పటివరకు ప్రతిరోజూ భూసేకరణ, పెండింగ్ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. భూసేకరణ కోసం ప్రత్యేక అధికారి శివకుమార్ కేటాయించబడతారని, ఆయనతో సమన్వయం చేసుకుని పనులు వేగవంతం చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో ఉత్తమ తహసీల్దార్లను నియమించి భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ కుష్బూ గుప్తాకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. “ఈ రోజు ఏమి చేశాం, రేపు ఏమి చేయాలి” అనే విధంగా రోజువారీ సమీక్ష చేయాలని అధికారులను సూచించారు. సీఎం వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా, ఎస్పీ జానకి, ఎమ్మెల్యేలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

