కలం, వెబ్ డెస్క్: తనను సార్ అని పిలవొద్దని, రేవంతన్న అని పిలవాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఉద్యోగులను ఉద్దేశించి అన్నారు. పదవి ఉన్నా, లేకపోయినా తాను ఎప్పటికీ ఒకేలా ఉంటానని స్పష్టం చేశారు. హోదా, పదవులు మారినా ప్రజలతో అనుంబంధం ఏమాత్రం మారబోదన్నారు. తనను కొందరు గుంపు మేస్త్రీ అంటూ అవహేళన చేస్తున్నారని.. అవును, మంత్రుల గుంపు అంతా తనదే అని కుండబద్దలు కొట్టారు. తనలో దొర పోకడలు లేవన్నారు. రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బీమా రక్షణ కోసం జరిగిన ఎంవోయూ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే ప్రతి నెలా ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేనాటికి అంతా గందరగోళంగా ఉందన్నారు. జీతాలు పదో తేదీ వరకు కూడా చెల్లిస్తూనే ఉన్నారని గుర్తు చేశారు. కచ్చితంగా ఒకటో తేదీనే జీతాలు వేయాలని సంకల్పించుకుని గత రెండున్నరేళ్లుగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వమే యజమాని అని, అందుకే వారి సంక్షేమానికి బీమా రక్షణ బాధ్యత తీసుకున్నట్లు వివరించారు.
గంట అదనంగా పనిచేయాలి..
ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పాత్ర మరవలేనిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇక నుంచి గంట సేపు అదనంగా పనిచేయాలని వారిని కోరారు. పన్నులు ఎగ్గొడుతున్నవారి నుంచి వసూళ్లు అయ్యేలా పనిచేయాలని, అలా సమకూరిన డబ్బులను తిరిగి ఉద్యోగుల సంక్షేమానికే ఉపయోగిస్తామని హామీ ఇచ్చారు. ఇటీవలే కేంద్రంతో మాట్లాడి వడ్డీ శాతాన్ని 7 శాతానికి తగ్గించినట్లు చెప్పుకొచ్చారు.

