కలం, ఖమ్మం బ్యూరో: ”మా వెనక భట్టి విక్రమార్క ఉన్నాడు.. నువ్వు ఏం పీక్కుంటావో పీక్కో!” అంటూ కాంగ్రెస్ నాయకులు చేసిన తీవ్ర బెదిరింపులు, వేధింపులు తాళలేక ఒక రైతు (Farmer) పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి (Suicide Attempt) పాల్పడిన దారుణ సంఘటన ఖమ్మం (Khammam) జిల్లా మధిర నియోజకవర్గంలో కలకలం రేపింది. చింతకాని మండలం నాగులవంచ గ్రామానికి చెందిన జొన్నలగడ్డ మల్లికార్జున రావు అనే రైతుకు చెందిన భూమిని లాక్కునేందుకు స్థానిక కాంగ్రెస్ నాయకులు కుట్ర పన్నుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మార్కెట్ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అంబటి వెంకటేశ్వరరావు ఆయన అనుచరులు గ్రామంలో రోడ్డు విస్తరణను సాకుగా చూపి, కేవలం సదరు రైతు మల్లికార్జున రావు భూమిని మాత్రమే స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అండదండలు ఉన్నాయనే అధికార బలంతో కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోయారని, భూమి విషయమై ప్రశ్నించినందుకు రైతుపై భౌతిక దాడులకు తెగబడ్డారని బాధితుడు ఆరోపించారు. “ఎవరికైనా చెప్పుకో.. ఏమైనా చేసుకో.. ఎదురొస్తే కేసులు పెట్టి జైలుకు పంపుతాం” అని తీవ్రస్థాయిలో బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు.
అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడం, ఒకవైపు భూమిపోతుందనే వేదన, మరోవైపు అధికార పార్టీ నాయకుల వేధింపులు, దాడులతో మనస్తాపానికి గురైన మల్లికార్జున రావు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆక్రమణలకు, దాడులకు పాల్పడుతున్న నాయకులపై కఠిన చర్యలు తీసుకుని, బాధిత రైతు కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని గ్రామస్థులు, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

