కలం, వెబ్ డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె (TGSRTC Strike) ఉధృతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రయాణికులకు ఇబ్బంది కలగనివ్వకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నిస్తున్నా పెద్దగా ఫలితం దక్కడం లేదు. నర్సంపేటలో ఓ ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యయత్నం చేసుకోవడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. ఆర్టీసీ కార్మికులకు కీలక విజ్ఞప్తి చేశారు. కార్మికులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. గురువారం హైదరాబాద్ లో క్యాబినెట్ భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశం చర్చకు వచ్చినట్టు సమాచారం.
ప్రాణాలు తీసుకోవడం పరిష్కారం కాదు
‘ప్రాణాలు తీసుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాదని.. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో దృష్టి పెట్టింది.’ అంటూ సీఎం వివరించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రులు శుక్రవారం మరోసారి ఆర్టీసీ కార్మికసంఘాలతో చర్చలు జరుపుతాయని ముఖ్యమంత్రి (CM Revanth Reddy) పేర్కొన్నారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఆర్టీసీ కార్మికులకు మెసేజ్
ఆర్టీసీ సమ్మె విషయంపై రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ , దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు శుక్రవారం 6.30 గం.లకు మీడియా ద్వారా మెసేజ్ ఇచ్చారు. మరి ముఖ్యమంత్రి పిలుపుతోనైనా కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరతారా? శుక్రవారం జరగబోయే చర్చలు ఫలిస్తాయా? ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు ప్రభుత్వం తలొగ్గుతుందా? అన్నది వేచి చూడాలి.
Read Also: ఆత్మహత్యకు యత్నించిన ఆర్టీసీ డ్రైవర్ పరిస్థితి విషమం
Follow Us On : WhatsApp

