కలం, వెబ్ డెస్క్: పార్లమెంట్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న మహిళా రిజర్వేషన్ ‘నారీ శక్తి వందన్ (Nari Shakti Vandan Bill)’ బిల్లు మద్దతుపై రాష్ట్రంలోని రాజకీయ పార్టీల అధ్యక్షులకు, రాజ్యసభ, లోక్ సభ ఎంపీలకు లేఖ రాసినట్లు సీఎం చంద్రబాబు (CM Chandrababu) తెలిపారు. 2029 ఎన్నికల నుంచే మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ల అమలు చేసేలా తీసుకువస్తున్న ‘నారీ శక్తి వందన్’ చట్ట సవరణ బిల్లుకు మద్దతు పలకాలని లేఖలో కోరినట్లు వెల్లడించారు. మహిళలకు పార్లమెంట్, విధాన సభల్లో మూడో వంతు రిజర్వేషన్లు కల్పించాలనే ప్రధాని మోదీ సంకల్పాన్ని బలపరుద్దామని విజ్ఞప్తి చేశారు.
పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ల సవరణ బిల్లు ప్రవేశపెట్టే ఈ నెల 16వ తేదీ భారత ప్రజాస్వామ్యంలో చారిత్రక ఘట్టంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ‘నారీ శక్తి వందన్ అధినియం’ (Nari Shakti Vandan Bill) మహిళా సాధికారతతో పాటు దేశ ఉన్నతికి దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంలో, పరిపాలనలో, చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే నిజమైన ప్రగతి సాధ్యం అవుతుందని తాను నమ్ముతానని చెప్పారు. భరతమాతను పూజించే దేశంగా నారీ శక్తికి వందనం పలుకుదామని ఈ మేరకు పిలుపునిచ్చారు.
Read Also: స్లీపర్ బస్సు.. జర్నీ టు హెల్
Follow Us On: X(Twitter)

