తెలుగుజాతి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన పార్టీ టీడీపీ: చంద్రబాబు

కలం, వెబ్ డెస్క్: తెలుగుజాతి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశమని సీఎం చంద్రబాబు (CM Chandrababu) స్పష్టం చేశారు. పేదవాడికి పట్టెడన్నం పెట్టాలని, పేదోడు సైతం గౌరవంగా బతకాలని నందమూరి తారక రామారావు (NTR) అనేవారని గుర్తు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం (TDP 44th foundation day) లో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి అనేక రికార్డులు నెలకొల్పామని అక్కడి సభలో సీఎం చంద్రబాబు వివరించారు. సామాన్యులను చట్టసభలకు పంపించిన పార్టీ, రాష్ట్ర అభివృద్ధికి దారి చూపించిన పార్టీ తెలుగుదేశం అని కొనియాడారు. టీడీపీ హయాంలో స్థానిక సంస్థల్లో మహిళలకు ఏనాడో రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. హైదరాబాద్‌ను మించిన నగరంగా అమరావతి మారుతుందని ఆకాంక్షించారు. ఇక మూడు ముక్కలాట ఉండదని.. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని ఉంటుందని చెప్పారు. అమరావతి వ్యతిరేక శక్తులను ఇక్కడకు రాకుండా చేయాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. టీడీపీ పాలనతో బీసీలు, ఎస్సీలు, ఎస్టీల జీవితాల్లో మార్పులు తెచ్చామని చెప్పారు. తమ పార్టీ విజయాలే కాకుండా సంక్షోభాలు, సవాళ్లనూ చూసిందని తెలిపారు. ఎందరో కార్యకర్తలు ఆస్తులు పోగొట్టుకున్నారని.. త్యాగాలు చేశారని గుర్తు చేశారు. ఎన్ని కుట్రలు పన్నినా తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేకపోయారని.. ఏమి చేయలేరని హెచ్చరించారు. పార్టీ కోసం ప్రాణాలర్పించిన వారి పిల్లల కోసం పాఠశాలలు పెట్టామని చెప్పారు. హత్యలు, అరెస్టులు, అణచివేతలు.. ఏవీ మనల్ని అడ్డుకోలేవని పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. సమర్థంగా పనిచేసే కార్యకర్తలకే గుర్తింపు ఉంటుందని సీఎం వ్యాఖ్యానించారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>