కలం, వెబ్ డెస్క్ : యోగాంధ్ర (Yogandhra) ఈసారి ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధికారులను ఆదేశించారు. జూన్ 21వ తేదీన నిర్వహించే అంతర్జాతీయ యోగా డే కు సంబంధించి శనివారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జూన్ 7 నుంచి 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఏపీ రాజధాని అమరావతిలో 25 వేల మందితో నిర్వహించే రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు.
ఆరోగ్య, మానవవనరులు, మున్సిపల్, పంచాయతీ రాజ్, దేవాదాయ, ఐటీ శాఖల సమన్వయంతో యోగాంధ్ర-2026 నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు. యోగాంధ్ర నిర్వహణకు జిల్లాకు రూ.25 లక్షల చొప్పున నిధులు కేటాయించినట్లు ప్రకటించారు. ఈ సమీక్ష సమావేశం లో మంత్రులు నారాయణ, సత్యకుమార్, ఆనం రామనారాయణ రెడ్డి, కందుల దుర్గేష్, సీఎస్ సాయిప్రసాద్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

