కలం, వెబ్ డెస్క్: ఏపీలో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు (Anna Canteens) ఏర్పాటు కానున్నాయి. బుధవారం పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అమరావతిలో సీఎం చంద్రబాబు అట్టహాసంగా ప్రారంభించనున్నారు. నగరాలు, పట్టణాల్లో ఇప్పటికే 207 అన్న క్యాంటీన్లు అందుబాటులో ఉన్నాయి. దీనికి తోడుగా మరో 62 క్యాంటీన్లను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇవాళ్టితో ప్రారంభించబోయే కొత్త క్యాంటీన్లతో ఈ సంఖ్య 269కు పెరుగనుంది. సీఎం చంద్రబాబు ఇవాళ మధ్యాహ్నం ఉండవల్లి నుంచి బయలుదేరి అమరావతిలోని ధరణికోటకు చేరుకుంటారు. అక్కడ అన్నక్యాంటీన్ ప్రారంభోత్సవంలో పాల్గొని లబ్ధిదారులతో కలిసి భోజనం చేస్తారు. ఆ తరువాత ప్రసంగించనున్నారు. కార్యక్రమానంతరం తిరిగి ఉండవల్లికి చేరుకుంటారు.
గత ప్రభుత్వం మూసివేసిన అన్నక్యాంటీన్లను కూటమి ప్రభుత్వం పునః ప్రారంభించింది. రుచి, శుచికి ప్రాధాన్యం ఇస్తూ ఆరోగ్యకరమైన ఆహారంతో పేదల కడుపునింపేదుకు కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. క్యాంటీన్ల పునఃప్రారంభం నుంచి ఇప్పటి వరకూ 8 కోట్ల 80 లక్షల మంది భోజనాలు చేశారు. ఒక్కో అన్న క్యాంటీన్లో సగటున రోజుకు 1,013 మంది చేసే భోజనాలకు 26 వేల 250 రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఇప్పటివరకు ఉన్న 207 అన్న క్యాంటీన్ల ద్వారా రోజుకు 2 లక్షల 10 వేల మంది భోజనాలు చేశారు. ఇందుకు రోజుకు 54 లక్షలకు పైగా ఖర్చు అవుతుండగా సబ్సిడీ కోసం ప్రభుత్వం ఇప్పటి వరకూ రూ. 243 కోట్లు వెచ్చించింది. కొత్తగా ఏర్పాటు చేసే గ్రామీణ అన్న కాంటీన్ల సబ్సీడీకి ఏడాదికి రూ.58 కోట్లు వ్యయం కానుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ధరణికోటతో పాటు భట్టిప్రోలు, ప్రత్తిపాడులో రాష్ట్ర ప్రభుత్వం అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.

