కలం, వెబ్ డెస్క్: అమరావతి (Amaravati)కి చట్ట బద్ధత కల్పిస్తూ సీఎం చంద్రబాబు (CM Chandrababu) ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపనుంది. రాజధాని చట్టబద్ధత తీర్మానంపై నిర్వహించిన చర్చలో 23 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సుమారు ఐదున్నర గంటల పాటు చర్చ సాగింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఏపీకి శాశ్వత రాజధానిగా ఉంటుందని, భవిష్యత్తులో ఎవరూ అమరావతిని ఏమీ చేయలేరని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అందరి ఆమోదంతో అమరావతిని రాజధానిగా ప్రకటించినట్లు తెలిపారు. నాడు వైఎస్ జగన్ కూడా రాజధానిగా అమరావతిని అంగీకరించారని గుర్తు చేశారు. అమరావతి అభివృద్ధి కోసం రైతులు ఎన్నో త్యాగాలు చేశారని కొనియాడారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు వేధింపులతో ఎన్నో గుండెలు ఆగాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజధాని చట్టబద్ధత కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలని కేంద్రం కోరినట్లు సీఎం వెల్లడించారు. జగన్ అసెంబ్లీకి వచ్చి రాజధానిగా అమరావతికి మద్దతు తెలుపుతారని భావించామని, అయితే జగన్ అసెంబ్లీకి రాకుండా తన కుట్రపూరిత బుద్ధిని నిరూపించుకున్నారని విమర్శించారు. 2028 నాటికి రాజధాని అమరావతి నిర్మాణ పనులన్నీ పూర్తవుతాయని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఎవరైనా కుట్ర పూరితంగా అమరావతి నిర్మాణాన్ని అడ్డుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. 2028లో ప్రధాని మోడీ చేతుల మీదుగా అమరావతి భవనాలు ప్రారంభిస్తామని సీఎం చెప్పారు.
2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత సింగపూర్లాంటి రాజధాని నిర్మించాలని భావించినట్లు సీఎం చెప్పారు. అయితే 2019లో వైసీపీకి అధికారం ఇవ్వడంతో అమరావతిపై విషం చిమ్మి రాజధాని నిర్మాణాన్ని ఆపేశారన్నారు. జగన్ పాలనలో 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయామని సీఎం వ్యాఖ్యానించారు. వైసీపీ మూడు రాజధానుల కుట్రను అసెంబ్లీలో తిప్పికొట్టామన్నారు. జగన్ పాలనను విమర్శిస్తూ ప్రత్యక్షంగా, పరోక్షంగా అందరూ జగన్ బాధితులేనని పేర్కొన్నారు. రాజధాని విషయంలో జగన్ తుగ్లక్ తీర్పు తీసుకున్నారని 2024 ఎన్నికల తీర్పు స్పష్టంగా తెలియజేసిందని సీఎం చెప్పారు.
Read Also: ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తప్పు చేశారు: మంత్రి అచ్చెన్నాయుడు
Follow Us On : WhatsApp

