కలం, వెబ్ డెస్క్: ఏపీ రాజధానిగా అమరావతి (Amaravati)కి చట్టబద్ధత కల్పించే బిల్లుకు పార్లమెంట్లోని ఉభయసభల్లో ఆమోదం లభించడంపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ సుధీర్ఘ పోస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇదొక మైలురాయి అని చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతిని ఏకైక ప్రజా రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంటు ఉభయ సభలు ‘ఆంధ్రప్రదేశ్ పునర్విభజన (సవరణ) బిల్లు-2026’ను ఏకగ్రీవంగా ఆమోదించడం గొప్ప విషయమన్నారు. ఇది ఏపీ ప్రజల ఆకాంక్షలకు దక్కిన జాతీయ స్థాయి గుర్తింపు అని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న తరుణంలో, అమరావతి రాజధానిగా ఉండాలన్న ఐదు కోట్ల మంది ప్రజల అభీష్టానికి ఈ బిల్లు చట్టబద్ధత కల్పించిందని కొనియాడారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు సీఎం ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 2015 అక్టోబర్ 22న అమరావతికి శంకుస్థాపన చేసిన నాటి నుండి, 2025 మే 2న రాజధాని విజన్ను పునరుద్ధరించే వరకు ప్రధాని మోడీ (PM Modi) రాష్ట్రానికి అండగా నిలిచారని గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా అమరావతికి మద్దతు తెలిపిన ఎంపీలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయంతో రాజధానిపై గత కొన్నేళ్లుగా ఉన్న అనిశ్చితికి తెరపడిందని, అభివృద్ధిలో ఒక కొత్త శకం ప్రారంభమైందని చంద్రబాబు స్పష్టం చేశారు.
అమరావతి కల సాకారం కావడానికి తమ భూములను త్యాగం చేసిన రైతుల అకుంఠిత దీక్షకు ఈ విజయం అంకితమని సీఎం భావోద్వేగానికి గురయ్యారు. రైతుల త్యాగం, పట్టుదల వల్లే నేడు అమరావతిని ఎవరూ మార్చలేని విధంగా, ఏ శక్తీ అడ్డుకోలేని విధంగా సుస్థిరపరుచుకున్నామని వివరించారు. అమరావతి ఇకపై కేవలం ఒక నగరం మాత్రమే కాదని, ఆంధ్రప్రదేశ్ గుండెకాయగా, దేశం గర్వించదగ్గ భవిష్యత్ నగరంగా దూసుకుపోతుందని చంద్రబాబు (CM Chandrababu) తన పోస్ట్లో వెల్లడించారు.
Read Also: హనుమాన్ జయంతి సందర్భంగా చిరంజీవి ఇంట్రెస్టింగ్ వీడియో
Follow Us On : WhatsApp

