కలం, వెబ్డెస్క్: ‘క్లాట్’ పరీక్ష (CLAT 2026) రాసి ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు షాక్. ఈ నెల 7 నుంచి దేశవ్యాప్తంగా లా యూనివర్సిటీల్లో యూజీ, పీజీ లా కోర్సులకు కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు ప్రారంభం కానుండగా, క్లాట్ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పరీక్ష కంటే ముందే ప్రశ్నపత్రం లీక్ అయ్యిందంటూ.. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలతోపాటు వాట్సాప్, టెలిగ్రామ్ తదితర వాటిల్లో వచ్చిన క్వశ్చన్ పేపర్, సమాధాన పత్రాల స్క్రీన్షాట్లను కోర్టుకు పిటిషన్దార్లు సమర్పించారు.
దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని, అంతవరకు కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు నిలిపివేయాలని కోరారు. పేపర్ లీక్ నిజమని తేలితే పరీక్ష రద్దు చేయాలని, స్వతంత్ర కమిటీ పర్యవేక్షణలో తిరిగి పరీక్ష నిర్వహించాలని విన్నవించారు. క్లాట్–2026 పరీక్ష రాసిన ఎస్సీ, ఎస్టీ, ఇతర ఓబీసీకి చెందిన కొందరు అభ్యర్థులు ఈ పిటిషన్ దాఖలు చేశారు.
కాగా, దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు, ఇతర లా వర్సిటీల్లో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్) నిర్వహిస్తారు. నిరుడు డిసెంబర్ 7న క్లాట్ పరీక్ష (CLAT 2026) జరిగింది. 25 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 156 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది 5వేల సీట్లకు 92వేల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. అనంతరం అదే నెల 16న ఫలితాలు వచ్చాయి. అయితే, పరీక్ష జరగడానికి ముందు రోజే.. అంటే డిసెంబర్ 6న ప్రశ్నపత్రం, సమాధానాలు వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో బయటికి వచ్చినట్లు ప్రచారం జరిగింది.
దీంతో నేషనల్ లా యూనివర్సిటీల కన్సార్షియం.. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంతో గ్రీవెన్స్ రెడ్రెసల్ పోర్టల్ ఏర్పాటుచేసింది. అయితే, ఇప్పటివరకు ఎలాంటి విచారణ నివేదిక గానీ, స్పష్టీకరణ గానీ విడుదల చేయలేదని పిటిషనర్లు ఆరోపించారు. పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేసిన అభ్యర్థులకు స్పందన రాలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనివల్ల ప్రజల్లో అనుమానాలు పెరిగాయని, ప్రక్రియపై నమ్మకం దెబ్బతిందని పిటిషన్లో పేర్కొన్నారు.
Read Also: తమిళనాట సంచలనం.. విజయ్తో కమలం దోస్తీ ?
Follow Us On: X(Twitter)


