కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana) రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ లేదా వంట గ్యాస్ (LPG) కొరత ఏమాత్రం లేదని రాష్ట్ర పౌర సరఫరాల (Civil Supplies) శాఖ స్పష్టం చేసింది. ఆయిల్ రిఫైనరీల నుండి స్థానిక డిపోల వరకు ఇంధన సరఫరా వ్యవస్థ పూర్తిగా సక్రమంగా పనిచేస్తోందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రజల అవసరాలకు సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
ఇటీవల కొన్ని పెట్రోల్ బంకుల వద్ద పొడవైన క్యూలు కనిపించడం, “నో స్టాక్” బోర్డులు పెట్టడం వంటి పరిస్థితులకు అసలు కారణం తప్పుడు వదంతులే అని అధికారులు వెల్లడించారు. ఈ వదంతులను నమ్మి ప్రజలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఇంధనం కొనుగోలు చేయడానికి పరుగులు తీయడంతో తాత్కాలికంగా కృత్రిమ కొరత ఏర్పడిందని చెప్పారు. అదనంగా, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMC) ముందస్తు చెల్లింపు విధానాల్లో చేసిన కొన్ని మార్పుల కారణంగా డీలర్లకు చిన్నపాటి సమస్యలు ఎదురైనా, అది సరఫరాపై ఎలాంటి ప్రభావం చూపలేదని స్పష్టం చేశారు.
పరిస్థితిని సమీక్షిస్తూ, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు, పెట్రోలియం సంస్థలు, పోలీసు శాఖ కలిసి పెట్రోల్ బంకుల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. ఇంధనాన్ని అక్రమంగా నిల్వ చేయడం, బ్లాక్ మార్కెట్ చేయడం లేదా గృహ అవసరాల గ్యాస్ను వాణిజ్య అవసరాలకు మళ్లించడం వంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజలకు విజ్ఞప్తి:
ప్రజలు భయపడకుండా ప్రశాంతంగా ఉండాలని, అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయవద్దని ప్రభుత్వం కోరింది. అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని, సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మకూడదని సూచించింది. ఏవైనా సందేహాలు ఉన్నా లేదా ఫిర్యాదులు చేయాలన్నా, ప్రజలు పౌర సరఫరాల శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1967 ను సంప్రదించవచ్చని తెలిపింది.
Read Also: భారతదేశంలో ఎవరి మతం వాళ్లకు ఉంటుంది: వాకిటి శ్రీహరి
Follow Us On: Instagram

