కలం, వెబ్ డెస్క్ : సినిమా ఇండస్ట్రీపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి (Anirudh Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ఇప్పపువ్వు సారాపై తాను మాట్లాడితే ట్రోలింగ్ చేశారని ఫైర్ అయ్యారు. సినిమాలో తాగితే తప్పు కాదు.. రాజకీయాల్లో మాట్లాడితే తప్పా? అని మండిపడ్డారు. ఖుషీ సినిమాలో సారా ప్యాకెట్లను పవన్ కల్యాణ్ పట్టుకోలేదా? బాలకష్ణ ‘ఏక్ పెగ్ లా’ అంటే తప్పు కాదా? అని ప్రశ్నించారు. అదే తాము ప్రజల ఆరోగ్యం గురించి ఇప్పపువ్వు ప్రస్తావన తీసుకొస్తే ట్రోల్ చేస్తున్నారని.. ఇదేం పద్దతి అని చెప్పుకొచ్చారు. తాను ఎవర్నీ తప్పు పట్టడం లేదన్న ఎమ్మెల్యే.. సారా తాగొద్దని మహిళలు భర్తలతో ఒట్టు వేయించుకోవాలని సూచించారు.
ఇకపై సినిమా యాక్టర్లందరూ 90 రోజులకు ఒకసారి డ్రగ్స్ టెస్టు (Drug Test) చేయించుకోవాలని ఎమ్మెల్యే (Anirudh Reddy) సంచలన డిమాండ్ చేశారు. డ్రగ్స్ టెస్టు తర్వాతే సినిమా రిలీజ్ కండీషన్ పెట్టాలని వ్యాఖ్యానించారు. అత్యధిక డ్రగ్స్ యాక్టివిటీ జరిగేది సినిమా ఇండస్ట్రీలోనని.. ఈ విషయాన్ని తాను చెప్పడం లేదు జనాలే అనుకుంటున్నారని వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీలో ప్రతి హీరోకు ఫ్యాన్ బేస్ ఉంటుందని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ ఆరు జేబుల ప్యాంట్ వేసుకుంటే ఫ్యాన్స్ కూడా అదే వేస్తారని.. చిరంజీవి స్టెప్ వేస్తే ఫ్యాన్స్ కూడా ఆ స్టెప్ ప్రాక్టీస్ చేస్తారని అన్నారు. నాయకులు చెప్పేదాని కంటే యాక్టర్లు చెప్పేది జనాల్లోకి త్వరగా వెళ్తుందన్నారు. అందుకే యాక్టర్లు డ్రగ్స్ టెస్టు చేసుకోవాలని చెప్పానని వివరించారు. యాక్టర్లు డ్రగ్స్ తీసుకోలేదని తేలితే ఫ్యాన్స్ కూడా ఆ మహమ్మారికి దూరంగా ఉంటారని తెలిపారు.
Read Also: తూతూమంత్రంగా ముగిసిన అసెంబ్లీ సమావేశాలు: హరీశ్ రావు
Follow Us On : WhatsApp

