కలం, వెబ్ డెస్క్ : తిరుపతి (Tirupati) జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియా రీల్స్ పట్ల ఉన్న పిచ్చి ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. అలిపిరి (Alipiri) పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక అపార్ట్మెంట్లో ప్రమాదవశాత్తు ఐదో అంతస్తు నుంచి కింద పడి 13 ఏళ్ల బాలిక మరణించింది.
నేపాల్ దేశానికి చెందిన ధను బహదూర్ దంపతులు జీవనోపాధి కోసం తిరుపతి (Tirupati)కి వలస వచ్చారు. వీరు స్థానికంగా ఉన్న ఒక అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. వారి 13 ఏళ్ల కుమార్తె పుష్ప, సోషల్ మీడియాలో రీల్స్ చేయడంపై ఆసక్తి పెంచుకుంది. ఈ క్రమంలో అపార్ట్మెంట్ ఐదో అంతస్తులో రీల్స్ వీడియోలు చిత్రీకరిస్తుండగా, అకస్మాత్తుగా పట్టు తప్పి ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. తీవ్ర గాయాలైన ఆ బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
సమాచారం అందుకున్న అలిపిరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, ఈ ప్రమాదంపై వివిధ కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. కళ్ళముందే బిడ్డ మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Read Also: సమ్మర్లో హెల్తీగా ఉండాలా.. ఈ 5 టిప్స్ మీకోసమే
Follow Us On : WhatsApp

