కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చికెన్ దుకాణాల (Chicken Shops) యజమానులు సమ్మె బాట పట్టారు. పౌల్ట్రీ కంపెనీలు తమకు ఇచ్చే కమీషన్ మార్జిన్లను పెంచాలని డిమాండ్ చేస్తూ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ నేటి నుంచి నిరవధిక బంద్కు పిలుపునిచ్చింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని సుమారు 50 వేల దుకాణాలు మూతపడ్డాయి. వెన్ కాబ్, స్నేహ చికెన్ వంటి దిగ్గజ కంపెనీలు తమను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, మార్జిన్లు పెంచే వరకు వెనక్కి తగ్గేదే లేదని అసోసియేషన్ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.
గతంలో కిలో చికెన్ విక్రయంపై రూ.26గా ఉన్న మార్జిన్ను యాజమాన్యాలు ఇటీవల రూ.10కి తగ్గించడంతో చికెన్ షాపుల అసోసియేషన్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమకు గిట్టుబాటు కావడం లేదని, కిలో చికెన్పై మార్జిన్ను రూ.40కి పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు దుకాణాలు తెరిచేది లేదని అసోసియేషన్ తెగేసి చెప్పడంతో పలు చోట్ల చికెన్ విక్రయాలు నిలిచిపోయాయి. హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
స్నేహ అవుట్ లెట్ వద్ద ఉద్రిక్తత..
అయితే, రాష్ట్రవ్యాప్తంగా బంద్ కొనసాగుతున్నప్పటికీ కొన్ని స్నేహ చికెన్ అవుట్ లెట్స్ మాత్రం తెరుచుకోవడం ఉత్కంఠకు దారితీసింది. దీనిని నిరసిస్తూ నేరెడ్మెట్ నుంచి మల్కాజ్గిరి వరకు ఉన్న అవుట్ లెట్స్ ముందు అసోసియేషన్ సభ్యులు ధర్నాకు దిగారు. పెరిగిన ధరలు, తగ్గిన మార్జిన్ల వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని, ప్రభుత్వం జోక్యం చేసుకుని పౌల్ట్రీ కంపెనీలతో చర్చలు జరపాలని యజమానులు కోరుతున్నారు.
వ్యాపారుల మధ్య వాగ్వాదం..
మార్జిన్ ధరల పెంపును డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా దుకాణాలను మూసివేయాలని చికెన్ షాపుల (Chicken Shops) యజమానుల సంఘం పిలుపునివ్వడంతో నాగర్కర్నూల్ జిల్లాలోని మెజారిటీ దుకాణాలు మూతపడ్డాయి. అయితే, ఈ బంద్కు మద్దతు తెలపకుండా ఒక యజమాని తన దుకాణాన్ని తెరవడం వివాదానికి దారితీసింది. విషయం తెలుసుకున్న ఇతర దుకాణదారులు అక్కడికి చేరుకుని నిలదీయడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
Read Also: 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది?.. కవిత ఫైర్
Follow Us On : WhatsApp

