కలం, వెబ్ డెస్క్: అంతర్జాతీయ మార్కెట్లో గత కొన్ని వారాలుగా ముడి చమురు ధరలు పెరగడంతో విమానం ఇంధనం ధరలు (Jet Fuel Prices) కూడా భారీగా పెరిగాయి. కిలో లీటర్ (1000 లీటర్లు) ఫ్లైట్ ఆయిల్ ధర రికార్డ్ స్థాయిలో రూ.2,07,341కి పెరిగింది. గతంలో కిలో లీటర్కు రూ.96,638 ఉన్న ధర.. ఏకంగా రెట్టింపు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. జెట్ ఫ్యూయల్ ధర రూ.2 లక్షల మార్కును దాటింది. ఇక మొత్తంగా గత నెలతో పోలిస్తే ఇంటర్నేషనల్ విమానాల ఫ్యూయల్ ధర 115%, డెమిస్టిక్లో 107% పెరిగింది. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఈ పెరుగుదల నమోదయింది. విమానయాన సంస్థలకు ఇంధన ఖర్చులు భారంగా మారాయి. ఈ తరుణంలోనే కొంతభాగాన్ని ప్రయాణికులపై మోపేందుకు చర్చలు జరుగుతున్నాయి. దీంతో విమాన టిక్కెట్ల రేట్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది.
ముఖ్యంగా రద్దీ మార్గాలు, పీక్ సీజన్లలో టిక్కెట్ ధరలు వేగంగా పెంచేందుకు యోచిస్తున్నారు. ధరల పెంపును సమతుల్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పౌర విమానయాన శాఖ రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదిస్తూ, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ATF)పై విధించే వ్యాట్ను తగ్గించాలని సూచిస్తోంది. భారతదేశంలో ఈ పన్ను రాష్ట్రానికి రాష్ట్రానికి మారుతూ ఉండటం వల్ల, కొన్ని ప్రాంతాల్లో ఇంధన వ్యయం (Jet Fuel Prices) ఎక్కువగా ఉంటోంది. రాష్ట్రాలు వ్యాట్ తగ్గింపుకు అంగీకరిస్తే, విమానయాన సంస్థలకు కొంత భారం తగ్గనుంది. ప్రస్తుతం ప్రయాణికులు, ముఖ్యంగా రాబోయే వారాల్లో ప్రయాణం ప్లాన్ చేస్తున్నవారు ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకోవడం ద్వారా ఖర్చులను కొంతవరకు తగ్గించుకోవచ్చు.
Read Also: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
Follow Us On: Instagram

