చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. ఆలేరు వద్ద తప్పిన ప్రమాదం

కలం, యాదాద్రి భువనగిరి: సికింద్రాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌ (Charminar Express) రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. యాదాద్రి (Yadadri Bhuvanagiri) జిల్లాలోని ఆలేరు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు చక్రాల నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రైలు ఆలేరు సమీపానికి చేరుకోగానే బోగీల కింద నుంచి దట్టమైన పొగలు రావడాన్ని గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. లోకో పైలట్ వెంటనే స్పందించి రైలును ఆలేరు స్టేషన్‌లో నిలిపివేశారు.

రైల్వే సాంకేతిక సిబ్బంది ప్రాథమికంగా తనిఖీలు చేపట్టగా, అది మంటలు కావని.. కేవలం బ్రేక్ లైనర్లు పట్టేయడం వల్ల వచ్చిన పొగలుగా గుర్తించారు. బ్రేక్ లైనర్ల మధ్య ఘర్షణ కారణంగా ఈ పొగలు వెలువడినట్లు అధికారులు స్పష్టం చేశారు. అధికారులు వెంటనే స్పందించి సాంకేతిక లోపాన్ని సరిదిద్దడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. సుమారు 15 నిమిషాల పాటు రైలును ఆలేరు స్టేషన్‌లోనే నిలిపివేశారు. సమస్యను పరిష్కరించిన అనంతరం రైలు తిరిగి చెన్నై వైపు బయలుదేరింది. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉండటంతో రైల్వే అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>