కలం వెబ్ డెస్క్: బిగ్బాస్ ఫేమ్ అషురెడ్డి (Ashu Reddy) తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిందని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అషురెడ్డిపై హైదరాబాద్ సీసీఎస్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని షేక్పేట్కు చెందిన ధర్మేంద్ర లండన్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నాడు. ధర్మేంద్ర 2018లో హైదరాబాద్కు వచ్చినప్పుడు అతడికి అషురెడ్డితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరం పెళ్లి చేసుకుందామని అషురెడ్డి ధర్మేంద్రను నమ్మించింది. ఆ తర్వాత అతడితో అషురెడ్డి బంగారం, కారు, ఇతర ఆస్తులు కొనిపించుకుంది. తన అవసరాలు తీరిన తర్వాత ధర్మేంద్రతో ముఖం చాటేసి పెళ్లికి నిరాకరించింది. అషురెడ్డిపై ధర్మేంద్ర తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కొడుకు నుంచి రూ.9.35 కోట్ల విలువ చేసే బంగారం, కారు, ఫ్లాట్లు కొనిపించుకోవడంతో పాటు నగదు కూడా తీసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ధర్మేంద్ర తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

