కలం, వెబ్డెస్క్: నేర రాజకీయాలే వైసీపీ పార్టీ ప్రధాన సంస్కృతిగా మారాయని, వారి పాలనంతా చట్ట వ్యతిరేకతకు ప్రతీకగా నిలిచిందని టీడీపీ(TDP) అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) విమర్శించారు. 2024లో తమ ప్రభుత్వం రాష్ట్రంలో సుపరిపాలనను స్థాపించిందని ఆయన స్పష్టం చేశారు. ఎక్స్ వేదికగా చంద్రబాబు చేసిన పోస్టులో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల సాధికారత, సేవే లక్ష్యంగా తాము రాజకీయాలు చేస్తున్నట్లు చెప్పారు. అధికారంలో లేకపోయినా వైసీపీ నేతలు నిరాశతో, అసహనంతో దుర్భాషలకు దిగుతున్నారని ఆరోపించారు. రోజురోజుకూ వారు చేసిన విధ్వంసం బయట పడుతుండటంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. తాము చేస్తున్న అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు అసహనానికి గురవుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అన్నింటి కంటే చట్టమే ఉన్నతమైందని, రాష్ట్రంలో స్థాపించిన చట్ట సుపరిపాలనను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడతామని, శాంతి భద్రతలకు భంగం వాటిల్లనివ్వమని స్పష్టం చేశారు. చట్టాన్ని అతిక్రమించేవారిని ఎవరిని ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు.


