కలం, నల్లగొండ బ్యూరో: కేంద్రమంత్రి బండి సంజయ్కి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను రాహు, కేతు గ్రహాలతో పోల్చిన బండి సంజయ్.. అసలు తను ఏ గ్రహమో, నవగ్రహాల్లో ఆయన ఎక్కడ ఉన్నారో చెప్పాలని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ కేవలం పత్రికా సమావేశాలకే పరిమితమవుతున్నారని, పెండింగ్ సమస్యలపై ఆయనకు సోయి లేదని చామల విమర్శించారు. మెట్రో ఫేజ్-2, రీజినల్ రింగ్ రోడ్, మూసీ ప్రక్షాళన వంటి కీలక ప్రాజెక్టుల విషయంలో బీజేపీ వైఖరి ఏంటో స్పష్టం చేయాలన్నారు. ‘కేంద్రం నుంచి నిధులను తీసుకొచ్చి భువనగిరిలో సభను పెట్టండి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కలిసి వస్తే పార్టీలకు అతీతంగా ప్రజలను తరలించే బాధ్యత మేము తీసుకుంటాం’ అంటూ చామల పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటీఎంలా వాడుకుందని విమర్శించే బీజేపీ, గత పదేళ్లుగా ఎందుకు చర్యలు తీసుకోలేదని చామల ప్రశ్నించారు.
సీబీఐ విచారణ ఎందుకు చేయడం లేదు
రాష్ట్ర ప్రభుత్వం 2025 ఆగస్టులోనే సీబీఐ విచారణకు లేఖ రాసినా, ఇప్పటి వరకు కేంద్రం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. అవసరం లేని చోట సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలను ప్రయోగిస్తున్న కేంద్రం.. కాళేశ్వరం అవినీతిపై ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ప్రశ్నించారు. బండి సంజయ్ (Bandi Sanjay) శాఖ పరిధిలోనే సీబీఐ ఉన్నా.. విచారణలో ఎందుకు జాప్యం వహిస్తున్నారని నిలదీశారు. జీవన్ రెడ్డి (Jeevan Reddy) ఆలోచన లేకుండా నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో అలిగితే పీసీసీ ప్రెసిడెంట్, ఏఐసీసీ కార్యదర్శులు స్వయంగా జగిత్యాల వరకు వెళ్లి బుజ్జగించారని గుర్తు చేశారు. కానీ బీఆర్ఎస్లో అలిగితే పట్టించుకునే నాథుడే ఉండడనీ ఎద్దేవా చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా చేసిన పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్లో చేరి ఏ పరిస్థితిలో ఉన్నారో చూస్తున్నామన్నారు. ఆయన వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో పెట్టుకునే స్థితికి దిగజారిపోయారు. రేపు జీవన్ రెడ్డి పరిస్థితి కూడా అదే అవుతుందంటూ జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ ఇచ్చే జనరల్ సెక్రటరీ పదవికి కాంగ్రెస్లో ఉండే హోదాకు ఉన్న వ్యత్యాసాన్ని జీవన్ రెడ్డి త్వరలోనే గ్రహిస్తారని చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala) పేర్కొన్నారు.
Read Also: ఇక బాంబ్ ల వర్షమే.. డొనాల్డ్ ట్రంప్ డెడ్లీ వార్నింగ్
Follow Us On: X(Twitter)

