కలం, వెబ్ డెస్క్: పశ్చిమాసియాలోని కొన్ని దేశాల్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సీబీఎస్ఈ (CBSE) కీలక నిర్ణయం తీసుకున్నది. బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమాన్, ఖతర్, సౌదీ అరేబియా, యూఏఈ దేశాల్లో నిర్వహించాల్సిన 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షలను వాయిదా వేసింది. మార్చి 5 (గురువారం), మార్చి 6 (శుక్రవారం) తేదీలకు నిర్ణయించిన పరీక్షలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సీబీఎస్ఈ సోమవారం జారీ చేసిన సర్క్యులర్లో పేర్కొంది. కొత్త పరీక్ష తేదీలను అనంతరం ప్రకటిస్తామని వెల్లడించింది.
మార్చి 7 నుంచి జరిగే పరీక్షలపై పరిస్థితిని మార్చి 5న సమీక్షించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. విద్యార్థులు తమ తమ పాఠశాలలతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తూ అధికారిక ప్రకటనలను జాగ్రత్తగా గమనించాలని సూచించింది. ఈ మేరకు పరీక్షల నియంత్రణాధికారి డా. సంయమ్ భారద్వాజ్ సర్క్యులర్ విడుదల చేశారు. సంబంధిత దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు, దుబాయ్లోని సీబీఎస్ఈ ప్రాంతీయ కార్యాలయానికి కూడా సమాచారం పంపినట్లు వెల్లడించింది.

