కలం, వెబ్ డెస్క్: వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu)పై కేసు నమోదు నమోదయింది. ట్రాఫిక్కు అంతరాయం కలిగించారని గుంటూరు నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. తన ఇంటిపై దాడి చేసినవారిని అరెస్ట్ చేయాలని ఈనెల 18న గుంటూరు కలెక్టరేట్ ఎదురుగా అంబటి దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. అయితే అనుమతి లేకుండా దీక్ష చేపట్టి, ట్రాఫిక్కు అంతరాయం కలిగించారని పోలీసుల కేసు నమోదు చేశారు.
ఆ ముగ్గురిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు..
ఆమరణ దీక్ష సందర్భంగా అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల సమక్షంలోనే తన ఇంటిపై దాడి జరిగిందని, దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాడ్ చేశారు. చంద్రబాబు, లోకేశ్, పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశాలతోనే నా ఇంటిపై దాడి జరిగిందని ఆరోపించారు. తన ఇంటిపై దాడి చేసిన వారిని వదిలిపెట్టనని హెచ్చరించారు. గుంటూరులో ఎప్పుడూ ఇలాంటి దాడులు జరగలేదని చెప్పారు. గుంటూరులో ఇళ్లపై దాడిచేసే సంస్కృతిని పెమ్మసాని చంద్రశేఖర్ తీసుకొచ్చారని.. పెమ్మసాని ఓడిపోతే అమెరికాకు స్పెషల్ విమానంలో వెళ్లిపోతారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేశ్, పెమ్మసానిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అంబటి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.
అసలేమైందంటే..
సీఎం చంద్రబాబు నాయుడుపై అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆగ్రహించిన టీడీపీ శ్రేణులు.. నవభారత్ నగర్ లోని అంబటి రాంబాబు నివాసం, కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే శాంతి భద్రతల దృష్ట్యా అంబటి రాంబాబును జనవరి 31న పోలీసులు అరెస్టు చేశారు. ఆ తరువాత ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. కొద్ది రోజుల తర్వాత ఫిబ్రవరి 18వ తేదీన ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం గుంటూరులో ఆయన దీక్షకు దిగి కూటమి నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

