కలం, మహబూబ్నగర్ బ్యూరో: వనపర్తి (Wanaparthy) జిల్లా బుద్ధారం పెద్ద చెరువు రిజర్వాయర్ (Buddharam Reservoir) భూ సేకరణకు సంబంధించి రైతుల అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదిస్తామని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుద్ధారం పెద్ద చెరువు రిజర్వాయర్ భూ సేకరణ అంశంపై సంబంధిత గ్రామ రైతులతో జిల్లా స్థాయి చర్చల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రిజర్వాయర్ పరిధిలోని 101 ఎకరాల భూముల రైతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బుద్ధారం పెద్ద చెరువు రిజర్వాయర్ (Buddharam Reservoir) నిర్మాణంలో సేకరించనున్న 101 ఎకరాల్లో అందరూ చిన్న, సన్నకారు రైతులే ఉన్నారని గ్రామస్థులు తెలిపారు. సుమారు 200 మంది రైతులు వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్నామని, భూములు కోల్పోతే తమకు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు ఎకరానికి ప్రభుత్వం నిర్దేశించిన విధంగా రూ.12.50 లక్షలు కాకుండా, పెద్ద మొత్తంలో నష్టపరిహారం ఇవ్వాలని విన్నవించారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలన్నారు.
ఆమోదయోగ్యం కాని పరిహారం కోరవద్దు..
అనంతరం కలెక్టర్ ఆదర్శ్ సురభి (Collector Adarsh Surabhi) మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో మార్కెట్ రేట్లకు అనుగుణంగా ధరను నిర్ణయిస్తుందన్నారు. ఆమోదయోగ్యం కాని పరిహారాన్ని కోరడం సమంజసం కాదన్నారు. రైతులకు న్యాయం చేసేందుకే ప్రభుత్వం తరఫున ఎప్పుడు ప్రయత్నిస్తామని తెలిపారు. వాస్తవ పరిస్థితులను ఆధారంగా మరోసారి నిర్ణయించుకుని రావాలని సూచించారు. భూములు కోల్పోయే వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు విషయంలో ప్రాధాన్యత ఇస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వినోద్ కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిరుపతయ్య, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, ఇతర రెవెన్యూ అధికారులు, గ్రామ సర్పంచి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: ఆ దమ్ము, పౌరుషం పొంగులేటికి ఉందా?: కేటీఆర్ సవాల్!
Follow Us On: X(Twitter)

