కలం, వెబ్ డెస్క్: ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మరో నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ERC) ముందుకు బీఆర్ఎస్ పార్టీ (BRS) వెళ్లనుంది. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలోని పార్టీ ప్రతినిధి బృందం ప్రజాభిప్రాయ సేకరణకు హాజరై, వాదనలను వినిపించనుంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ‘రైతు డిస్కం’ పేరుతో చేపట్టిన చర్యలను వివరించేందుకు ఈఆర్సీ ముందుకు వెళ్లనుంది. రైతు డిస్కం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని.. వాటిని ఈఆర్సీ ఉంచేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది.
రేపు ఉదయం 10 గంటలకు ఈఆర్సీ ముందు జరగనున్న ప్రజాభిప్రాయ సేకరణలో రాష్ట్ర రైతులు, ప్రజల పక్షాన గులాబీ పార్టీ తన గళాన్ని వినిపించనుంది. ‘రైతు డిస్కం’ ప్రతిపాదనల వల్ల రైతాంగానికి, రాష్ట్ర విద్యుత్ రంగానికి వాటిల్లే నష్టాలను, ప్రభుత్వ వైఖరిని పార్టీ ప్రతినిధులు కమిషన్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. పార్టీ ప్రతినిధి బృందంలో మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, సీనియర్ నాయకులు, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిలతో పాటు ఇతర సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.

