కలం, ఖమ్మం బ్యూరో: కొత్తగూడెం నియోజకవర్గ పార్టీ సమావేశంలో గురువారం జరిగిన ఘటనకు ప్రధాన కారకుడైన ఎండీ అక్బర్ (MD Akbar) అలియాస్ గాంధీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి ఖమ్మం జిల్లా సభ్యత్వ నమోదు ఇంచార్జ్, ఎంఎల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు ప్రకటించారు. ఘటనకు బాధ్యుడైన అక్బర్ కొత్తగూడెం నియోజకవర్గంలోని 72వ (సిల్ క్యాంపస్) బూత్ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నాడని పార్టీ గుర్తించింది. జరిగిన సంఘటనను పార్టీ హైకమాండ్ సీరియస్ గా తీసుకుని.. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండేందుకు అక్బర్ పై సస్పెన్షన్ వేటు వేయడం జరిగిందన్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి, ప్రతిష్టను దెబ్బతీసే చర్యలకు పాల్పడే వారు ఎంత స్థాయిలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఉపేక్షించబోదని తక్కెళ్లపల్లి రవీందర్ రావు స్పష్టం చేశారు.

