కలం మెదక్ బ్యూరో : సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి లోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో గులాబీ బాస్ కేసీఆర్ (KCR) అధ్యక్షతన 6 గంటలపాటు బీఆర్ఎస్ పార్టీ సుదీర్ఘ సమావేశం జరిగింది. ఈ సమావేశం వివరాలను ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఈ సమావేశంలో కేసీఆర్ ప్రజాసమస్యలు,పార్టీ నిర్మాణం పై పలు సూచనలు చేశారని వెల్లడించారు. సభ్యత్వ నమోదులో భాగంగా పార్టీ మెంబర్ షిప్ ను కేసీఆర్ తీసుకున్నారని తెలిపారు. అంతేకాదు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ లో చేరిన నియోజకవర్గాల్లో ఇంచార్జ్ ల నియామకం చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఆదేశించినట్లు పేర్కొన్నారు.
జిల్లా నియోజకవర్గ, మండల స్థాయి పర్యవేక్షకులతో సభ్యత్వ నమోదు పకడ్బందీగా చేయాలని, పార్టీ అనుబంధ సంఘాలను బలోపేతం చేయాలని, పార్టీ కోసం పనిచేసిన వారికే బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు పాల్గొన్నారు.

