కలం, భువనగిరి : సీఎం రేవంత్ రెడ్డి పర్యటనతో యాదాద్రి భువనగిరి జిల్లాకు ఏం ఒరగలేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రా రెడ్డి (BRS Leader Kalluri Ramachandra Reddy) మండిపడ్డారు. ఆదివారం భువనగిరిలోని ఆ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు రావడం ఐదో సారి అని చెప్పారు. జిల్లా అభివృద్ధికి రూ.400 నుండి రూ. 500 కోట్ల నిధుల వరాలు ప్రకటిస్తారని, రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం ఇస్తారని ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నా? ఏం జరగలేదన్నారు. అధికారుల ప్రోటోకాల్ లోపం వల్ల సీఎం ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. ఇది ప్రజల ఆశలపై చన్నీళ్లు చల్లడమే కాదు… వారిని ఘోరంగా అవమానించడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్వాపురం రిజర్వాయర్, గంధమల్ల రిజర్వాయర్ పనులు పడకేశాయని, ముంపు బాధితులకు నష్టపరిహారం ఇవ్వకుండా వారి ఉసురు పోసుకుంటున్నారని కల్లూరి రామచంద్రారెడ్డి
ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రోటోకాల్ వివాదంపై బాధ్యులను సస్పెండ్ చేయాలి..
దేశ చరిత్రలో ఎక్కడైనా ఒక ముఖ్యమంత్రి హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత, అధికారుల కోసం 15 నిమిషాల పాటుచాపర్లోనే ఎండలో ఎదురుచూసిన దౌర్భాగ్యపు దాఖలాలు ఉన్నాయా అని రామచంద్రారెడ్డి (BRS Leader Kalluri) నిలదీశారు. కలెక్టర్ నుంచి కింది స్థాయి అధికారుల వరకు.. అందరూ స్థానిక ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే భజనలో తరిస్తూ, అసలు సీఎం ఎక్కడ దిగుతున్నారో కూడా తెలియని సోయీ లేకుండా నిద్రపోయారని దుయ్యబట్టారు. బాధ్యులైన వారిని సస్పెండ్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ల్యాండ్, క్రషర్ మాఫియాకు అధికారుల కాపలా!
జిల్లాలో ల్యాండ్ మాఫియా, క్రషర్ మాఫియా తోకలాడిస్తుంటే అధికారులు కాపలా వ్యవహరిస్తున్నారని కల్లూరి రామచంద్రారెడ్డి ఆరోపించారు. యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలోని ఒక సర్వే నెంబర్లో ఉన్న 726 లో ప్రభుత్వ భూమిని ఒక కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థ కాజేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. చల్లూరు గ్రామంలోని సర్వే నెంబర్ 324లో ప్రభుత్వ అసైన్డ్ భూములను ఆక్రమించారని, ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా క్రషర్ నడుపుతున్నారని ఆధారాలు ఇచ్చినా కనీసం ఆ అక్రమ క్రషర్ వైపు కన్నెత్తి చూసిన అధికారి లేరని కల్లూరి ఆరోపించారు.
Read Also: స్మార్ట్ మీటర్ల కాంట్రాక్ట్ ఓ స్కామ్: జగదీశ్ రెడ్డి
Follow Us On : WhatsApp

