కలం, వెబ్ డెస్క్ : రాజకీయ కక్షతో ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అర్ధంతరంగా నిలిపివేసిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఆరోపించారు. సిద్ధిపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 30 డీఈఓ పోస్టులు ఖాళీగా పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యావ్యవస్థను గాలికి వదిలేసిందని విమర్శించారు. ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకుండా తీవ్ర ఆర్థిక క్షోభకు గురిచేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
33 జిల్లాలున్న రాష్ట్రంలో కేవలం ముగ్గురు రెగ్యులర్ డీఈవోలు ఉన్నారని తెలిపారు. అదనపు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జడ్పీ సీఈఓలు, ఐఏఎస్ అధికారులకు డీఈఓ బాధ్యతలు అప్పగించడం వల్ల వారు విద్యపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారని తెలిపారు. తక్షణమే రెగ్యులర్ డీఈఓలను నియమించాలని ప్రభుత్వాన్ని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
మన ఊరు – మన బడి కార్యక్రమానికి అవసరమైతే పేరు మార్చుకొని కొనసాగించాలి తప్పా నిలిపివేయొద్దని సూచించారు. నిలిపివేయడం ద్వారా పాఠశాలల అభివృద్ధి కుంటుపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్స్ స్కావెంజర్ల బిల్లులు పెండింగ్ లో ఉండడం వల్ల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల భారం పడుతోందని హరీశ్ రావు చెప్పారు.

