కలం, కరీంనగర్ బ్యూరో: పెద్దపల్లి జిల్లాలో తీవ్ర కలకలం రేగింది. పోలీస్ అధికారుల వేధింపులు భరించలేక ఓ ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS) పార్టీ నేత బలవన్మరణానికి యత్నించడం స్థానికంగా సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా నిట్టూరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు కల్లెపల్లి సంపత్ రావు (Kallepalli Sampath Rao) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పెద్దపల్లి పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ (SI) తనను తీవ్రంగా వేధిస్తున్నారంటూ ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలోనే ఎస్ఐ వేధింపులను తట్టుకోలేక సంపత్ రావు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు.
గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన కరీంనగర్లోని సన్రైజ్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కావాలనే వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తూ పోలీసుల ద్వారా తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. సంపత్ రావు ఆత్మహత్యా యత్నానికి కారణమైన సదరు ఎస్ఐపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

