కలం, నిజామాబాద్ బ్యూరో : ఇందూరు నగరంలోని బాపూజీ వచనాలయంలో బీజేవైఎం ఆధ్వర్యంలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ (Dhanpal Suryanarayana) , బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి (Dinesh Kulachari) హాజరయ్యారు. సమావేశంలో విద్యార్థులు, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ (Dhanpal Suryanarayana), దినేష్ పటేల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను (Fee Reimbursement Funds) వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సుమారు రూ.8 వేల కోట్ల బకాయిలతో పాటు మరో రూ.2,500 కోట్ల నిధులను తక్షణమే మంజూరు చేయాలని కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఫీజులు చెల్లించలేక చదువులు మధ్యలోనే నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతోందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఖండించారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల ఆలస్యం వల్ల విద్యార్థులు, వారి కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఇచ్చిన ఉద్యోగ హామీలను నెరవేర్చాలని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు నిరుద్యోగ భృతి హామీని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే బీజేవైఎం, బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని నాయకులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీజేవైఎం తెలంగాణ కోశాధికారి ఆమంద్ విజయ్ కృష్ణ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు దాంపల్లి జ్యోతి, పంచారెడ్డి అనిత, బంటు రాము, బెల్లల్ శశాంక్, ఎస్ఆర్ సత్యపాల్, వినోద్ రెడ్డి, ఇందూరు సుధా, బీజేపీ నాయకులు, బీజేవైఎం నాయకులు, నిరుద్యోగ యువత పాల్గొన్నారు.
Read Also: డ్రగ్స్ స్మగర్ల ఆస్తులు జప్తు: డీజీపీ సీవీ ఆనంద్
Follow Us On: X(Twitter)

