కలం, స్పోర్ట్స్ : ఇంగ్లండ్ క్రికెట్లో కీలక మార్పు చోటుచేసుకుంది. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఉన్న బ్రెండన్ మెకల్లమ్ను (Brendon McCullum) ఆ పదవి నుంచి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) తప్పించింది. అయితే వైట్బాల్ (వన్డే, టీ20) జట్లకు ఆయన ప్రధాన కోచ్గా కొనసాగనున్నారు. యాషెస్లో 4-1 తేడాతో పరాజయం, స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 2-1తో సిరీస్ కోల్పోవడం వంటి వరుస వైఫల్యాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben Stokes) అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకడం కూడా చర్చనీయాంశమైంది.
2022లో టెస్టు కోచ్గా బాధ్యతలు చేపట్టిన మెకల్లమ్ దూకుడు ఆటతీరుకు ప్రాధాన్యతనిస్తూ “బాజ్బాల్” శైలికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారు. ఆయన హయాంలో ఇంగ్లండ్ న్యూజిలాండ్పై 3-0, దక్షిణాఫ్రికాపై 2-1తో స్వదేశంలో సిరీస్లు గెలవడమే కాకుండా, పాకిస్థాన్ను వారి సొంత గడ్డపై 3-0తో చిత్తు చేసింది. అయితే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో మాత్రం ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. మెకల్లమ్ హయాంలో జట్టు క్రమశిక్షణ, డ్రెస్సింగ్రూమ్ వాతావరణంపై కూడా విమర్శలు వచ్చాయి. స్టోక్స్తో విభేదాలు ఉన్నాయన్న ప్రచారం మధ్య ఆయన రిటైర్మెంట్ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. తనను టెస్టు కోచ్ పదవి నుంచి తప్పించిన నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని మెకల్లమ్ పేర్కొన్నారు. టెస్టు జట్టుతో గడిపిన సమయం ఎంతో గర్వకారణమని, ఇకపై వైట్బాల్ జట్ల విజయాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తానని వెల్లడించారు.

