కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ బేగంపేట (Begumpet)లో ఉన్న వాతావరణ శాఖ ప్రాంతీయ కార్యాలయానికి శుక్రవారం బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. కార్యాలయంలో మొత్తం 14 బాంబులు అమర్చామని, మధ్యాహ్నం కల్లా అవన్నీ పేలిపోతాయని అజ్ఞాత వ్యక్తులు ఈమెయిల్ పంపారు. ఈ సమాచారం అందిన వెంటనే అప్రమత్తమైన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఘటనా స్థలానికి చేరుకున్న బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు భవనం అంతటా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాయి. ముందుగా ప్రధాన బ్లాక్ లో సోదాలు నిర్వహించి, అక్కడ ఎటువంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా కార్యాలయంలోని ఉద్యోగులను బయటకు పంపించి, మిగిలిన ప్రాంతాల్లో కూడా తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఈ బెదిరింపు మెయిల్ ఎక్కడి నుండి వచ్చింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

