కలం, వెబ్ డెస్క్ : తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నిర్వహణలో గత ప్రభుత్వ హయాంలో భారీ అక్రమాలు జరిగాయంటూ సాధు పరిషత్ (Sadhu Parishad) ప్రతినిధులు సంచలన ఆరోపణలు చేశారు. తిరుపతిలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో స్వామీజీలు మాట్లాడుతూ.. వరాహ స్వామి ఆలయ విమాన గోపురం బంగారు తాపడం పనుల్లో సుమారు 20 కిలోల బంగారం మాయమైందని వారు ఆరోపించారు. కేవలం బంగారం అపహరణే కాకుండా, వరాహ స్వామి ఆలయ గోపురంపై ఉన్న విగ్రహాలను కూడా ధ్వంసం చేశారని స్వామీజీలు అన్నారు.
ఈ అక్రమాలు కేవలం తిరుమలకే పరిమితం కాలేదని, తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయ విమాన గోపురం పనుల్లోనూ దాదాపు 120 కేజీల బంగారం స్వాహా అయిందని సాధు పరిషత్ ప్రతినిధులు విమర్శించారు. గోపురాల కలశాలను గత టీటీడీ చైర్మన్, ఈవోలు కలిసి రైస్ పుల్లింగ్ గ్యాంగ్లకు అమ్ముకున్నారని వారు ఆరోపించారు. ఈ వ్యవహారాలకు సంబంధించి టీటీడీ విజిలెన్స్ విభాగం వద్ద పక్కా ఆధారాలు ఉన్నప్పటికీ, ఉన్నతాధికారుల ఒత్తిడి కారణంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.
అంతేకాకుండా స్వామివారి శక్తిని క్షీణింపజేసేలా గతంలో తాంత్రిక పూజలు కూడా నిర్వహించి ఉండవచ్చనే అనుమానాలను స్వామీజీలు వ్యక్తం చేశారు. శ్రీవారి ఆస్తుల పరిరక్షణలో విఫలమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ కుంభకోణాలపై సమగ్ర విచారణ జరిపించాలని సాధు పరిషత్ (Sadhu Parishad) డిమాండ్ చేసింది.
Read Also: టీటీడీ భగవద్గీత పుస్తకాల ప్రచురణ వివాదం
Follow Us On: Youtube

