కలం, కరీంనగర్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలలో పని చేస్తున్న నాన్ టీచింగ్ ఉద్యోగులను (Non Teaching Staff) తొలగించే ప్రయత్నాలను వెంటనే మానుకోవాలని భారత్ మజ్దూర్ సంఘ్ (BMS) రాష్ట్ర నాయకులు విజయ్ డిమాండ్ చేశారు. మహాత్మా జ్యోతి బాపూలే గురుకులాల నాన్ టీచింగ్ స్టాఫ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమావేశం శుక్రవారం రోజున కరీంనగర్ లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విజయ్ హాజరయ్యారు. గత 2017 సంవత్సరం నుండి స్వీపింగ్, హౌస్ కీపింగ్, సెక్యూరిటీ, శానిటేషన్ తదితర విభాగాల్లో సేవలు అందిస్తున్న కార్మికులను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కాంట్రాక్టర్లకు టెండర్ ఇవ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకుల విద్యాసంస్థలు సక్రమంగా నడవడంలో నాన్ టీచింగ్ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని, అలాంటి కార్మికులను ఒక్కసారిగా విధుల నుండి తొలగించడంతో వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుందన్నారు.
సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బీఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పప్పుల సురేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు నిరుద్యోగ నిర్మూలన, యువతకు ఉద్యోగాల కల్పన గురించి మాట్లాడుతూనే.. మరోవైపు ఇప్పటికే పనిచేస్తున్న కార్మికుల ఉద్యోగాలను తొలగించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు కనీస వేతనాలు, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి హక్కులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే తొలగింపుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఎంఎస్ (BMS) కరీంనగర్ జిల్లా అధ్యక్షులు పసుల శ్రావణ్, కార్యదర్శి తొర్తి శ్రీనివాస్ నాయకులు మెండే శివశంకర్, అంజన్న, సుజాత, నిర్మల, భాగ్యగురుకుల కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
Read Also: ప్రధాని మోదీపై విద్యార్థులకు నమ్మకం లేదు: రాహుల్ గాంధీ
Follow Us On : WhatsApp

