కలం, వెబ్ డెస్క్: పంజాబ్ రాజకీయాల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), బీజేపీ (BJP) మధ్య మాటల యుద్ధం ముదిరింది. అమృత్సర్, జలంధర్లలో ఇటీవల జరిగిన పేలుళ్ల వెనుక బీజేపీ కుట్ర ఉందంటూ సీఎం భగవంత్ మాన్ (Bhagwant Mann) చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన బీజేపీ.. ఆయనకు పరువు నష్టం నోటీసు జారీ చేసింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ తరఫున న్యాయవాదులు ఈ నోటీసు పంపారు.
బహిరంగంగా క్షమాపణ చెప్పాలి
పంజాబ్ ఎన్నికలకు ముందు ప్రజలను మతపరంగా, కులపరంగా విభజించేందుకు బీజేపీ ఇలాంటి చిన్నపాటి పేలుళ్లకు పాల్పడుతుందని, ఇది ఆ పార్టీ ఎన్నికల ప్రిపరేషన్ అని భగవంత్ మాన్ బుధవారం ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. సీఎం ఎటువంటి ఆధారాలు లేకుండా బాధ్యతారహితమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని తరుణ్ చుగ్ మండిపడ్డారు. పంజాబ్ పోలీసులే ఈ పేలుళ్ల వెనుక విదేశీ శక్తులు లేదా ఐఎస్ఐ (ఐఎస్ఐ) హస్తం ఉండొచ్చని చెబుతుంటే, సీఎం మాత్రం రాజకీయ లబ్ధి కోసం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని నోటీసులో పేర్కొన్నారు. 7 రోజుల్లోగా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో క్రిమినల్, సివిల్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని బీజేపీ హెచ్చరించింది.

