కలం, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా ఆలయాలు, పర్యాటక ప్రాంతాలు, బీచ్ల్లో పెరుగుతున్న వ్యర్థాల సమస్యపై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు దాఖలైన ఓ పిటిషన్పై జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ ప్రాంతాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు-2026ను అత్యంత కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలను గుర్తించి, అక్కడ వ్యర్థాల సేకరణ, తరలింపు, శాస్త్రీయ పరిష్కారం కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోరింది. ముఖ్యంగా విదేశీ పర్యాటకులు వచ్చే ప్రాంతాలను అత్యంత శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది.
కలెక్టర్లకు బాధ్యతలు..
ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనల అమలును పర్యవేక్షించే బాధ్యతను కలెక్టర్లకు అప్పగించాలని.. ఇందుకోసం కేంద్ర పర్యావరణ శాఖ ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించే బల్క్ వేస్ట్ జనరేటర్లకు (ఎక్కువ చెత్త ఉత్పత్తి చేసే సంస్థలు) నీరు, విద్యుత్తు సరఫరా నిలిపివేసే అధికారాన్ని కూడా కలెక్టర్లకు కల్పించింది. పర్యావరణ పరిరక్షణ అనేది రాబోయే తరాలకు మనం ఇచ్చే గొప్ప బహుమతని, ఇందులో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ధర్మాసనం హెచ్చరించింది.

