కలం, వెబ్ డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వం ఏర్పాటుపై కొనసాగుతున్న ఉత్కంఠ నేపథ్యంలో జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వేంబు (Sridhar Vembu) కీలక వ్యాఖ్యలు చేశారు. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. స్పష్టమైన మెజారిటీ సాధించడంలో విఫలం కావడంతో రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి, మళ్లీ కొత్తగా ఎన్నికలు నిర్వహించడమే ఉత్తమమని ఆయన అభిప్రాయపడ్డారు.
బలవంతంగా కూటముల ఏర్పాటు
తమిళనాడు అసెంబ్లీలోని ప్రస్తుత గణాంకాలు ఏ పార్టీకి అనుకూలంగా లేవని.. బలవంతంగా కూటములను ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని నడపడంతో అస్థిరత ఏర్పడుతుందని వేంబు హెచ్చరించారు. అస్థిరమైన ప్రభుత్వం కంటే.. ప్రజల నుంచి స్పష్టమైన తీర్పు రావడం ముఖ్యమని పేర్కొన్నారు. ముఖ్యంగా, తదుపరి ఎన్నికల్లో ‘ఓటుకు నోటు’ పంపిణీని అత్యంత కఠినంగా అరికట్టాలని, అప్పుడే నిజమైన ప్రజాస్వామ్య విజయం లభిస్తుందని ఆయన పిలుపునిచ్చారు. మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తే విజయ్ నేతృత్వంలోని టీవీకే భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ బేరసారాల కంటే ఎన్నికలకు వెళ్లడమే రాష్ట్ర ప్రయోజనాలకు మంచిదని సామాజిక మాధ్యమాల వేదికగా ఆయన తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

