కలం, నాగర్ కర్నూల్: విద్యార్థుల స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో విద్యార్థులతో BJYM ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి (Thalloju Achary) పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుపేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అందించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని , బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
గడిచిన 5 సంవత్సరాల నుండి ప్రభుత్వం రూ. వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్ బకాయిలను విడుదల చేయకపోవడం వల్ల ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు , విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు హాల్ టికెట్లు, సర్టిఫికెట్లు అందేలా చూడాలన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్న ఈ ప్రభుత్వానికి విద్యార్థులు, మేధావులు, ప్రజలు త్వరలోనే సమాధానం చెప్తారని ఆచారి హెచ్చరించారు.
విద్యార్థుల సంక్షేమాన్ని పక్కన పెట్టిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఇంటికి పంపే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా నిద్రమత్తు వీడి తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థులు, యువత మరియు ప్రజలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో BJYM జిల్లా అధ్యక్షుడు ధన్నోజు నరేష్ చారి, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేందర్ గౌడ్, గోరటి నరసింహ, బిజెపి టౌన్ అధ్యక్షుడు చవ్వ ప్రమోద్, నాయకులు బోడ నరసింహ, రాంభూపాల్ రెడ్డి, దుర్గా ప్రసాద్, శ్రీను, నరేడ్ల శేఖర్ రెడ్డి, చీల సుదర్శన్, యువ మోర్చా నాయకులు పాల్గొన్నారు.

