కాంగ్రెస్ పాల‌న‌లో రైతుల పరిస్థితి అగమ్య గోచరం: బీజేపీ నేత‌ కృష్ణారెడ్డి

కలం, కరీంనగర్ బ్యూరో: అహోరాత్రులు శ్రమించి, చెమటోడ్చి పండించిన పంటను అమ్ముకోవడానికి అన్నదాతలు అష్ట కష్టాలు పడుతున్నారని, కాంగ్రెస్ సర్కార్ పాలనలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి (Gangadi Krishna Reddy) అన్నారు. గురువారం జమ్మికుంట మార్కెట్ యార్డ్‌లో మక్క కొనుగోలు కేంద్రాల ను స్థానిక బీజేపీ శ్రేణులతో కలిసి గంగాడి కృష్ణారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. 20 రోజులైనా మక్కలు కొనుగోలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో కాంగ్రెస్ ఉదాసీనత వైఖరి స్పష్టంగా కనిపిస్తుందన్నారు. గన్నీ బ్యాగులు సరఫరా చేయలేక ధాన్యాన్ని తరలించడానికి వాహనాలు ఏర్పాటు చేయలేక, తూకం వేయడానికి కేంద్రాలలో కనీసం కూలీలను కూడా ఏర్పాటు చేయలేని దౌర్భాగ్యస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నందుకు సిగ్గుతో తలదించుకోవాలన్నారు.

మొక్కజొన్న రైతులపై కాంగ్రెస్ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంద‌ని కృష్ణా రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం మక్కల కొనుగోలు ప్రారంభించకపోవడంతో రైతులు మార్కెట్ యార్డులోనే పడిగాపులు కాస్తున్నారని , ఇదే అదునుగా భావించిన కొంతమంది దళారులు, ట్రేడర్లు రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. మక్కలకు కనీస మద్దతు ధర (ఎమ్ ఎస్ పి )ధర రూ.2400 ఉంటే, కొంతమంది అధికారులు, ట్రేడర్లతో కుమ్మక్కై రైతుల నుండి రూ.1600, రూ.1800లకే మొక్కజొన్న పంటను కొనుగోలు చేస్తూ రైతాంగాన్ని తీవ్రంగా మోసం చేస్తున్నారన్నారు. పంటలను సకాలంలో కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తూ దళారులను పెంచి ప్రోత్సహిస్తూ రైతులను నిలువు దోపిడి చేయిస్తుందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి రైతాంగ సంక్షేమం అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదనే విషయం ఇలాంటి సంఘటనలతో స్పష్టంగా అర్థమవుతుందన్నారు.

రైతులకు అన్యాయం చేయకుండా ఇప్పటికైనా న్యాయం జరిగే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని , యార్డులో ఉన్న మొక్కజొన్న పంటను ఎమ్ఎస్పీ ధ‌ర చెల్లించి పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే అధికారులు , ట్రేడర్లు కుమ్మక్కై రైతాంగాన్ని నిలుదోపిడి చేస్తున్న వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి తో పాటు మండలాధ్యక్షుడు రమేష్ యాదవ్, పట్టణాధ్యక్షుడు కొలకాని రాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పుప్పాల రఘు, మాజీ జిల్లా కార్యదర్శి కనుమల్ల గణపతి, బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, జిల్లా ఉపాధ్యక్షుడు సంపత్ రావు, మాజీ మండలాధ్యక్షుడు సంపెల్లి సంపత్ రావు, సర్పంచి పుప్పాల రాజారం , శీలం శ్రీనివాస్, రాజేష్ ఠాగూర్, టంగుటూరి రాజ్ కుమార్, ఆవుల తిరుపతి, జీడి మల్లేష్, మెరుగు శ్రీనివాస్, తూర్పాటి శంకర్, కైలాసకోటి గణేష్, రాచేపల్లి ప్రశాంత్, శ్రీమతి అఖిల్, కొమ్ము అశోక్ ఆడవాళ్ళ శ్రీధర్, ఆకుల పోశయ్య, తిరుపతి, కొండ్ల నగేష్, సమ్మిరెడ్డి గట్టు వీరన్న, చంద్రమౌళి ,వెంగళరావు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>