కలం, వెబ్ డెస్క్: తమిళనాడు బీజేపీ కీలక నేత అన్నామలై (Annamalai) రాజీనామా చేస్తారనే ఊహాగానాల నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ క్లారిటీ ఇచ్చారు. అన్నామలై పార్టీకి రాజీనామా చేయబోరని, బయట జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదంటూ కీలక ప్రకటన చేశారు. అన్నామలై బీజేపీకి అత్యంత కీలకమైన వ్యక్తని, ఆయన సలహాలు, సూచనలకు తప్పకుండా ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే, నాగేంద్రన్ వ్యాఖ్యల నేపథ్యంలో అన్నామలై తన రాజీనామాపై వెనక్కి తగ్గినట్లే కనిపిస్తోంది.
అమిత్ షాతో సమావేశం తరువాతనే..
జాతీయ మీడియా కథనాల ప్రకారం, అన్నామలై బీజేపీకి రాజీనామా చేయాలని దాదాపు ఫిక్సయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నభిన్తో జరిగిన సమావేశంలో అయిదు పేజీల రాజీనామా లేఖ కూడా అందించారు. అయితే, అమిత్ షాను కలిసిన తరువాత సీన్ మొత్తం మారిపోయినట్లు తెలుస్తోంది. అన్నామలై పార్టీని వీడేందుకు అమిత్ షా అంగీకరించలేదని దిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అప్పటికప్పుడు నైనార్ నాగేంద్రన్కు ఫోన్ చేసి దిల్లీకి రావాలని ఆదేశించారు. అన్నామలైని బుజ్జిగించిన అమిత్ షా.. ఆయన పెట్టిన షరతులు, డిమాండ్లకు అంగీకరించినట్లు చెబుతున్నారు. తనకు పార్టీలో ఫ్రీ హ్యాండ్ కావాలని, త్వరలో చేపట్టబోయే యాత్రకు మద్దతు కావాలని అడగగా, అమిత్ షా సంపూర్ణంగా అంగీకరించినట్లు చర్చ జరుగుతోంది. త్వరలోనే అన్నామలై ప్రధాని మోదీతో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు.

