కలం, వెబ్ డెస్క్ : ప్రపంచ పర్యావరణ దినోత్సవం (World Environment Day) సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) పిలుపునిచ్చారు. భూమి మన ఇల్లు, ప్రకృతి మన జీవనాధారం అని పేర్కొంటూ సహజ వనరులను కాపాడుకోవడం అత్యంత అవసరమని ఆయన అన్నారు. పర్యావరణాన్ని రక్షించుకోవడం కోసం గాలి, నీరు, నేల కాలుష్యాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలని ప్రజలకు సూచించారు. పచ్చదనం పెంపుతో పాటు ఇంధన వనరులను పొదుపుగా వినియోగించడం ద్వారా భవిష్యత్ తరాలకు మెరుగైన ప్రపంచాన్ని అందించవచ్చని చెప్పారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 5న ప్రజలందరూ సైకిళ్లు, ఈ-సైకిళ్లను ఉపయోగించాలని, ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటాలని చంద్రబాబు కోరారు. చిన్నచిన్న చర్యల ద్వారానే పర్యావరణ పరిరక్షణలో పెద్ద మార్పు తీసుకురావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగా రేపు విశాఖపట్నం పర్యటనలో తాను సైకిల్పై ప్రయాణించి పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించి, పచ్చని ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

