కలం, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామి కొండపైన కొనసాగుతున్న వర్తక సంఘాన్ని తక్షణమే రద్దు చేయాలని బీజేపీ (BJP) పట్టణ శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు బీజేపీ నాయకులు దేవదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులకు వినతిపత్రం అందజేశారు. మంగళవారం హైదరాబాద్లో ప్రిన్సిపల్ సెక్రెటరీ, కమిషనర్ హనుమంతరావు, అడిషనల్ కమిషనర్ కృష్ణవేణిలను కలిసి క్షేత్రస్థాయిలో జరుగుతున్న అవకతవకలను వివరించారు. ఎన్నో ఏళ్లుగా కొండపై ఉన్న 115 దుకాణాలను బహిరంగ టెండర్లు వేయడం లేదని తెలిపారు. కేవలం రెన్యూవల్ ప్రక్రియ ద్వారానే కొనసాగించడం ఎండోమెంట్ యాక్ట్ విరుద్ధమని బీజేపీ నాయకులు మండిపడ్డారు.
రాజకీయ అండదండలతో కొందరు పెత్తందారులు ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకుని దేవస్థాన ఆదాయానికి గండి కొడుతున్నారని ఆరోపించారు. వర్తక సంఘం ముసుగులో దుకాణదారులు భక్తుల నుంచి అధిక రేట్లు వసూలు చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది కూడా రెన్యూవల్ పేరుతో భారీగా నిధులు చేతులు మారే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట (Yadagirigutta) పట్టణ బీజేపీ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి సాగుతున్న ఈ పెత్తందారీ వ్యవస్థను రద్దు చేయాలన్నారు. ఈసారి కూడా టెండర్లు పిలవకుండా దుకాణాలను రెన్యూవల్ చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అధికారులకు వినతిపత్రం అందించినవారిలో పట్టణ ప్రధాన కార్యదర్శి మందోజి నరేశ్, నాయకులు శివరాత్రి శ్రీశైలం, బోగా అజయ్, శ్రీనాథ్, విజయ్, ప్రవీణ్, శ్యామ్ పాల్గొన్నారు.
Read Also: ఆర్టీసీ చర్చలు విఫలం.. అర్ధరాత్రి నుంచి బస్సులు బంద్!
Follow Us On: X(Twitter)

