కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ పర్యాటక (AP Tourism) రంగానికి జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. ప్రకృతి అందాలను ఆస్వాదించాలంటే ఆంధ్రప్రదేశ్కు వెళ్లాల్సిందేనని దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులకు నీతి ఆయోగ్ (Niti Aayog) సూచించింది. ఈ మేరకు నీతి ఆయోగ్ ‘దివ్య భారత్’ నివేదిక ద్వారా ఏపీ టూరిజంపై 13 పేజీల సమగ్ర నివేదికతో పాటు గంట 20 నిమిషాల నిడివి గల స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా కూచిపూడి, విలాసిని నాట్యాల వంటి సంప్రదాయ కళలకు ఏపీ కేంద్రమని, ఇక్కడి ఆత్మీయ ఆతిథ్యం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుందని నీతి ఆయోగ్ పేర్కొంది. అలాగే ప్రకృతి ఒడిలో అరకు వ్యాలీ, లంబసింగి, మారేడుమిల్లి, పాపికొండలు, కురుపాం అటవీ ప్రాంతాలు, నల్లమల్ల అడవులు, హార్సిలీ హిల్స్, కొల్లేరు, పులికాట్ సరస్సు, కోనసీమలకు చోటు కల్పించింది.
చారిత్రక యాత్రగా బొర్రా గుహలు, బెలూం గుహలు, ఉండవల్లి, మొగల్రాజపురం, ఉదయగిరి గుహలు చూడాలని వెల్లడించింది. గండికోట (గ్రాండ్ కాన్యన్ ఆఫ్ ఇండియా), కొండపల్లి కోట, చంద్రగిరి, గుత్తి కోటలు తప్పక సందర్శించాలని సూచించింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో తిరుమల వేంకటేశ్వరస్వామి, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గమ్మ, అన్నవరం, సింహాచలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, విశాఖపట్నం అప్పికొండ శ్రీ సోమేశ్వర ఆలయం, పాలకొల్లు క్షీరారామ క్షేత్రం, మహానంది, యాగంటి, పరిటాల ఆంజనేయ స్వామి, రామతీర్థం ఆలయాలకు నీతి ఆయోగ్ అగ్రతాంబూలం ఇచ్చింది. ఆంధ్రా వంటకాలైన పులిహోర, పూతరేకులు, కాజా, పెసరట్టు, గోంగూర పచ్చడి, ఉలవచారు, బొబ్బట్లను నీతి ఆయోగ్ తన నివేదికలో ప్రశంసించింది. ఏపీని సందర్శించేందుకు అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు అత్యంత అనువైన సమయమని నీతి ఆయోగ్ సూచించింది.
Read Also: జీవన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్కు ప్రయోజనం ఎంత?
Follow Us On: Sharechat

