కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలో విద్యుత్ శాఖ అధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. అవినీతి నిరోధక శాఖ అధికారి వివరాల ప్రకారం… ఐడీఏ బొల్లారంలో విద్యుత్ శాఖ అడిషనల్ అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న రామకృష్ణారెడ్డి, మహమ్మద్ ఇఫ్రాజు అనే వ్యక్తికి సంబంధించిన కరెంట్ పోల్ పునర్నిర్మించడానికి రూ. 25,000 లంచం డిమాండ్ చేశారు.
లంచం ఇవ్వడం ఇష్టం లేని ఇఫ్రాజు ఈ విషయమై ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు గురువారం పక్కా ప్రణాళికతో దాడులు నిర్వహించారు. ఏఈ రామకృష్ణారెడ్డి బాధితుడి నుంచి రూ. 25 వేల నగదు తీసుకుంటుండగా అధికారులు ఆయన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడి నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు, ప్రస్తుతం ఆయనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

