కలం, వెబ్ డెస్క్: ప్రపంచ జల దినోత్సవం (మార్చి 22) సందర్భంగా ప్రముఖ నటి, సోషల్ యాక్టివిస్ట్ భూమి పెడ్నేకర్ (Bhumi Pednekar) తెలంగాణలోని మహబూబ్ నగర్ (Mahbubnagar) జిల్లా, మద్గుల మండలం, కొల్కులపల్లిలో పర్యటించారు. గ్రామంలోని కమ్యూనిటీ ప్యూర్ వాటర్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె గ్రామీణ భారతంలో నెలకొన్న తీవ్రమైన నీటి ఎద్దడి, స్వచ్ఛమైన తాగునీటి ఆవశ్యకత గురించి మాట్లాడారు. సురక్షితమైన తాగునీరు అనేది కేవలం ప్రజల ప్రాథమిక హక్కు మాత్రమే కాదని, అది ప్రజల ఆరోగ్యం, గౌరవానికి సంబంధించిన విషయమన్నారు. వాతావరణ మార్పులు, భూగర్భ జలాలు అడుగంటిపోవడం వంటి కారణాల వల్ల దేశం ఎదుర్కొంటున్న నీటి సంక్షోభంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ పర్యటనలో భాగంగా భూమి పెడ్నేకర్ స్థానిక మహిళలు, విద్యార్థులతో ముచ్చటించారు. స్వచ్ఛమైన నీటి వల్ల వారి జీవితాల్లో వచ్చిన మార్పులను అడిగి తెలుసుకున్నారు. కమ్యూనిటీ ప్యూర్ వాటర్ సంస్థ వ్యవస్థాపకులు రవి రెడ్డి సారథ్యంలో సాగుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం 600పైగా కేంద్రాల ద్వారా రోజుకు సుమారు 15 లక్షల మందికి తక్కువ ధరకే శుద్ధి చేసిన నీరు అందుతోంది. టెక్నాలజీ, సమాజ భాగస్వామ్యంతో ఇలాంటి పరిష్కార మార్గాలే నీటి కొరతను అధిగమించడానికి సరైన మార్గమన్నారు. దీని కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని భూమి పెడ్నేకర్ (Bhumi Pednekar) పిలుపునిచ్చారు.
Read Also: శ్వాసకోశ వ్యాధులకు మీ ఇల్లూ కారణమే.. ఎందుకో తెలుసా?
Follow Us On: Instagram

