కలం, వెబ్ డెస్క్: అసెంబ్లీలో మైనింగ్ మంటలు అగ్గిరాజుకున్నాయి. నిన్నటినుంచి సభలో వేడి వాతావరణం నెలకొంది. రాఘవ కన్స్ట్రక్షన్ వ్యవహారంతో మొదలైన చర్చ.. చిలికి చిలికి గాలివానలా మారింది. ప్రతిపక్ష, అధికార పక్షాల సభ్యుల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఈ క్రమంలోనే సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర ఖజానాకు మేలు జరిగే విధంగా తమ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ సమయంలో సభను తామెప్పుడూ అడ్డుకోలేదన్నారు. కానీ బీఆర్ఎస్ సభ్యులు మాత్రం నిన్నటి నుంచి సభను మాటిమాటికి అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడితే హౌస్ కమిటీ వేయాలని అంటున్నారని.. హౌస్ కమిటీ వేసి ఏం సాధిస్తారని ప్రశ్నించారు.
ప్రతి సారి రాజకీయం చేయాల్సిన పని లేదని.. రాష్ట్ర అభివృద్ధి కోసం సభను జరపాలన్నారు. గత ప్రభుత్వంలో వేసిన హౌస్ కమిటీ విచారణ నివేదికలు ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ వాళ్ళు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు జరగాలన్నట్లుగా సభ జరుగదని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో ధరణి పోర్టల్ (Dharani Portal) తో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు పంచిన భూముల్ని.. బీఆర్ఎస్ వాళ్ళు తమకు కావాల్సిన వారి పేరుమీదుగా ఎక్కించుకున్నారని ఆరోపించారు. వ్యక్తిగత ఆస్తుల్ని బీఆర్ఎస్ వాళ్ళు అడ్డగోలుగా బెదిరించి లాక్కున్నారని భట్టి (Bhatti Vikramarka) ఫైర్ అయ్యారు. హౌస్ కమిటీల ద్వారా మేలు జరుగుతుందనుకుంటే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా హౌస్ కమిటీ వేసి నిజానిజాలు బయటపెడుతామన్నారు.
Read Also: కాళేశ్వరంపై విచారణ చేపట్టాకే.. మాకు సూచనలు ఇవ్వాలి: CM రేవంత్
Follow Us On : WhatsApp

