కలం, నల్లగొండ బ్యూరో: ఇటీవల గుండెపోటుతో మరణించిన తన పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎం.మధుసూధన్ (PRO Madhusudhan) మరణం బాధాకరమని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. శుక్రవారం అయన నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని దివంగత మధుసూదన్ గృహాన్ని సందర్శించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. మధు మరణం తనకు షాకింగ్ న్యూస్ అని, మధుసూదన్ మరణ వార్త విన్న వెంటనే తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. చిన్న వయసులో మధుసూదన్ చనిపోవడం బాధాకరమని, భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మధుసూదన్ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని ఈ సందర్భంగా భట్టి భరోసా ఇచ్చారు. మధుసూదన్ భార్య జ్యోతి, కుమారుడు వెంకట్ సూరజ్లను ఆయన ఓదార్చారు. డిప్యూటీ సీఎం వెంట మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, తదితరులు ఉన్నారు.

