వడ్డీలు కడుతూ పథకాలు అమలు చేస్తున్నాం: భట్టి

కలం, వెబ్ డెస్క్: రాష్ట్రానికి ఉన్న అప్పుల్లో పెండింగ్‌ అసలు, వడ్డీలు కడుతూ పథకాలు అమలు చేస్తున్నామని అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. ప్రభుత్వ హామీలు నెరవేర్చట్లేదని ఆరోపించడం సరికాదన్నారు. ఒక్కో కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరిందనేది లెక్కలతో చెబుతామన్నారు. అర్హులైన 53 లక్షల మందికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాల్లో 1.06 కోట్ల మందికి సన్న బియ్యం ఇస్తున్నామని అన్నారు. పెద్దఎత్తున సన్న బియ్యం ఇవ్వడం దేశ చరిత్రలో ఎక్కడా లేదన్నారు.

గతంలో పేదలకు రెండు పడక గదుల ఇళ్లు ఇస్తామన్న హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. ఏడాదిలో 4.5 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నామని.. నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Indlu) ఇస్తున్నామని చెప్పారు. పేదల ఇళ్లకు రూ.5 లక్షల చొప్పున అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని మహిళలను మహాలక్ష్ముల్లా గౌరవిస్తామని.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. ఎకరాకు రూ.12 వేల చొప్పున రైతులకు రైతుభరోసా నిధులు ఇస్తున్నామని వివరించారు. రైతులకు ఎకరా పేరిట రూ.25 వేల బోనస్‌ వస్తోందన్నారు.

కేటీఆర్‌ దారి తప్పారని అనిపిస్తోందని భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళల అభివృద్ధి, సంక్షేమం గురించి గత ప్రభుత్వానికి ఎలాంటి ఆలోచన లేదని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్‌ హయాంలో మహిళా మంత్రులను తీసుకోలేదన్నారు. ఏడాదికి రూ.20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలను మహిళలకు ఇప్పించే చర్యలు తీసుకుంటున్నామని వివరించారు ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చే లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. మహిళలకు ఇప్పటివరకు రూ.57 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇప్పించామని చెప్పారు. మహిళలపట్ల చులకనగా మాట్లాడటం సరికాదని కేటీఆర్ కు (KTR) సూచించారు. మీ ఇంటి ఆడబిడ్డపై ఎలాంటి గౌరవం ఉందో రాష్ట్రమంతా చూస్తోందని దుయ్యబట్టారు. మీ వ్యాఖ్యలు కోట్లాది మహిళల ఆత్మగౌరవాన్ని కించపరుస్తోందని కేటీఆర్ ను ఉద్దేశించి మాట్లాడారు.

Read Also: వేసవి వచ్చేసింది.. వార్డ్‌రోబ్‌లో ఈ మార్పులు చేసుకోండి

Follow Us On: Pinterest

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>